Friday, July 22, 2011

అమ్మమ్మ కతలు: సరదాగా సినిమాకి

అసలే ఎండాకాలం. ఒంటి పూట బళ్ళు. ఎంత త్వరగా స్కూల్ అయిపోతుందా. అమ్మమ్మ ఇంటికి వెళదామా అని ఎదురుచూస్తూ ఉండగానే అమ్మమ్మ గొడుగు వేస్కొని వచ్చేసింది నా కోసం. స్కూల్ నుండి తీసుకు వచ్చి అన్నం తినిపించాగానే బాగా అలిసిపోయి నిద్ర ముంచుకు వచ్చేసింది నాకు. అమ్మమ్మ నా తల నిమురుతూ వుంటే ఎప్పుడు నిద్రలో జారుకున్ననో తెలియదు. నన్ను జాగ్రత్తగా  పడుక్కోబెట్టింది.

ఉదయం పదవ్వగానే ఆవిడ భోజనం అయిపోయేది. కిళ్ళీ  వేసుకొని పడుక్కునేది కాసేపు. అమ్మమ్మ ఏంటి? కిళ్ళీ  వేస్కోడం ఏంటి? అనుక్కునేరు. ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ వుంటుంది. అమ్మ తిడుతుందేమో అని భయం ఒక పక్క వున్నా మా అమ్మని ఇదే విషయం అడిగేసా ఒక రోజు. మా అమ్మమ్మకి పెళ్ళయ్యాక హఠాత్తుగా పంటినొప్పి రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో ఎవరో చెక్క నవలమని చెప్పిన సలహా విని మా తాతగారు చెక్క తెప్పించి ఇచ్చేవారు. పంటినొప్పి తగ్గినా చెక్క అలవాటు అలాగే ఉండిపోయింది. తరవాత కిళ్ళీవేసుకోడం అలవాటయ్యింది అని అమ్మ చెప్పింది.

నేను నిద్రపోయానని అలా పక్కింటి మామ్మగారి ఇంటికి వెళ్లి లోకాభిరామాయణం మాట్లాడుతోంది అమ్మమ్మ.  "మన పక్క థియేటర్లో 'మల్లీశ్వరి' సినిమా ఆడుతోంది పిన్నిగారు. మధ్యాహ్నం వెళదామా?" అని మామ్మగారు మా అమ్మమ్మని   అడిగారు. ఆవిడ అడగడం ఇది మూడోసారి. నిజానికి ఆ సినిమా అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. అందులో "మనసున మల్లెల మాలలూగెను..." అనే పాటంటే ఇంకా ప్రాణం. కాని వేసవి ఎండలు కొంచం తగ్గాక వెళ్ళచ్చు అని వాయిదా వేస్తూ వచ్చారు కమలమ్మగారు. ఇంకా ఆలస్యం చేస్తే సినిమా వెళ్లిపోతుంది అని ఆవిడ అనడంతో మరునాడు వెళ్ళాలని ఇద్దరు అనుకున్నారు. 

ఈ లోపు నేను నిద్ర లేవడం, అమ్మమ్మ కనిపించక "అమ్మమ్మ !!అమ్మమ్మా!!" అంటూ ఏడుస్తూ తలుపు తెరవబోయాను. కాని అది రాలేదు. బహుశా అమ్మమ్మ బయటనుండి గడియపెట్టి వుంటుంది. దానితో మరింత ఏడుపు వచ్చింది. ఈ లోగా ఎవరో చూసి అమ్మమ్మకి చెప్పడంతో పరుగెత్తి వచ్చి తలుపు తెరిచి నన్ను ఎత్తుకుంది. "పండు, నిద్ర లేచావా. నువ్వు పడుకున్నావు కదా అని పక్కింటి బామ్మగారితో మాట్లాడుతున్న కన్నా" అని ఊరుకో బెట్టింది. ఏడుపు ఆపక పోవడంతో "ఏడవకు రా కన్నా. రేపు మనం సరదాగా సినిమాకి వెళదాం. సరేనా" అని అనడంతో నేను చాలా సంతోషించా. 

మరునాడు రానే వచ్చింది. స్కూల్ నుండి రాగానే అన్నం తిని మాట్నీకి బయలుదేరాం ముగ్గురం. మాములుగా అయితే నడిచిపోయే దూరమేగాని మండుటెండ పైగా చిన్నపిల్లని నేనున్నాను అని  రిక్షా బేరమాడుకుని వెళ్లాం. తీరా చుస్తే థియేటర్లో 'వందేమాతరం' అనే కొత్త సినిమా ఆడుతోంది.  'మల్లీశ్వరి' సినిమా ముందురోజు వెళ్లిపోయిందిట.   ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళు అనుకునేంతలో నేను ఆరున్నొక్క రాగం పెట్టడంతో ఇక తప్పక ఆ సినిమా టికెట్స్ తీసుకున్నారు. ధియేటర్లో జనం పల్చగావున్నారు. సినిమా మొదలవ్వడంతో అంతా కూర్చున్నారు. మా ముందువరుసలో ఓ తల్లితండ్రి పిల్లజెల్ల కుర్చుని వున్నారు. వారి ముందు సీట్లు అన్ని ఖాళీ. సినిమా మొదలైన పావుగంట తరవాత "అమ్మమ్మా నేను ఆ ఖాళీ సీట్లలో కుర్చుంటా ప్లీజ్" అని అడిగా. సరే అంది అమ్మమ్మ. ఇంటర్వల్ రాగానే పెద్దగా ఓ ఆడ గొంతు, మా అమ్మమ్మ గొంతు పొట్టాడుకుంటూ వినిపించాయి. "ఎహ్ హమారీ బచ్చి హై" అంటే "కాదు ఇది నా పిల్ల" అని పెద్ద గొడవ. అక్కడ ఓ మినీ యుద్ధవాతావరణం నెలకొంది.  నేను ఓ ఐదునిమిషాల తరవాత మెల్లగా గొంతుపెగుల్చుకుని "అమ్మమ్మ నేను ఇక్కడే వున్నా" అని అనడంతో మా అమ్మమ్మ వాళ్ళతో సిగ్గుపడి "క్షమించండి అచ్చు మా మనవరాలి లాగ కనపడితేను..." అని మాత్రం అనగలిగింది. "ఇంటికి వెళ్ళాక నీ పని అయిపోయింది" అంది నా మనసు . అమ్మమ్మ మాత్రం "నువ్వు ఎప్పుడు అక్కడ కుర్చున్నావో మర్చిపోయానే" అని నవ్వేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.

No comments:

Post a Comment