Wednesday, July 20, 2011

అమ్మమ్మ కతలు: స్కూలు గోల

"ప్రొద్దుననగా వెళ్ళింది స్కూలుకి. ఏం చదువులో ఏంటో ఈ కాలం పిల్లలకి" అని తిట్టుకున్నారు కమలమ్మ గారు ఎల్.కె.జి చదువుతున్న నన్నుతల్చుకుంటు. అలా అని ఆవిడకి చదువంటే ఇష్టం లేదని అనుకునేరు. చదువంటే ఆవిడకి ప్రాణం. చిన్నవయస్సులో భర్త పొతే బండెడు సంసారన్ని ఒంటరిగా ఎలా ఈదుకొచ్చిందో ఆవిడకే తెలుసు. అందుకే చదువు ఆడపిల్లలకి ఎంతో ముఖ్యం అని ఆవిడ తన కూతుర్లు అందరిని కొడుకులతో సమానంగా చదివించింది. నా మీద ప్రేమతో అలా అనిపించింది ఆమెకి. అంతే!!

నాన్న ఉద్యోగరీత్యా మేము ఆ ఊర్లోనే వుండేవాళ్ళం.అమ్మమ్మ ఇంటికి దగ్గర వున్న స్కూల్లో చదివేదాన్ని.  తన ఇంటికి  స్కూల్ దగ్గరే కావడంతో మధ్యాహ్నం లంచ్ అవర్లో నన్ను తీసుకొచ్చి అన్నం తినిపించి మరల స్కూలుకి దిగబెట్టేవారు కమలమ్మగారు. ఎప్పుడైనా ఒంటిపూట బళ్ళు ఐతే, అమ్మ సాయంకాలం వచ్చి తీసుకువెళ్ళే వరకు తన దగ్గర అట్టే పెట్టుకుని వీధిలో బంధువులు, స్నేహితుల ఇళ్ళకి 'మా మనుమరాలు ' అని మురిపెంగా తీసుకువెళ్ళేవారు ఆవిడ.

"అమ్మమ్మా అమ్మమ్మా!" అంటూ అల్లుకుపొయేదాన్ని.అందుకే ఆవిడకు నేనంటే వల్లమాలిన ప్రేమ.స్కూల్లో రోజు పన్నెండు గంటలకి లంచ్ బెల్ కొట్టినా, అమ్మమ్మ మాత్రం "పిల్ల ఎండ పడిపోతుంది" అని ఓ గొడుగు పుచ్చుకుని అరగంట ముందే చేరుకుని "మీ చదువులు మీరు, మీ మొహాలు మండా. చంటి వెధవలకి ఇంతింతసేపు చదువులు ఏవిటి?" అని అక్కడ అటెండర్ ని తెగ కంగారు పెట్టేసేవారు. అటెండర్ అప్పారావు కి ఇది మాములే. "బామ్మగారు, ప్లీజ్!! నా వుద్యోగం వూడి పోతుందండీ . అలా మీ మనుమరాలు ఒక్కర్తి కోసం బెల్లు కొట్టకూడదండి" అనేవాడు.

ఎప్పుడైనా భోజనం తరువాత "అమ్మమ్మా! ఇవాళ స్కూల్ కి వెళ్ళను" అని గోల పెడితే క్లాస్స్ రూం లోపలవరకు తీసుకువెళ్లి దిగబెట్టి కాసేపు కూర్చుని వచ్చేది ఆవిడ. పెద్దయ్యాక ఒక్కోసారి కాలేజ్, లేదా ఆఫీసు కి వెళ్ళాలని అని అనిపించక పోతే, అదే గుర్తుకు వచ్చేది నాకు. ఇంకా మారం చేస్తే 'తాయిలం' ఇస్తానని ఆశ పెట్టి స్కూల్ కి పంపేది.

ఇలా రోజులు గడిచిపోతుండగా, ఒక రోజు కూడా ప్రతిరోజులాగానే ఆవిడ గొడుగుతో బయలుదేరారు. కాకపొతే ఆవేళ కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఆయాసపడుతూ రొప్పుతూ కమలమ్మగారు వెళ్ళేసరికి అటెండర్ అప్పారావు అక్కడ స్టూల్ మీద కనపడలేదు. "వీడు రోజు ఇక్కడే వుంటాడు. అలాంటిది ఇవాళ కనపడట్లేదేవిటో" అని కంగారుపడుతూ ఆఫీస్ రూం వైపు దారితీసారు కమలమ్మగారు. "ఏమ్మా లంచ్ బెల్ కొట్టేసారా?" అని అక్కడ కనిపించిన ఆయాని అడిగారావిడ."కొట్టేసారండి" అని చెప్పేసరికి "ఎల్.కె.జి క్లాస్ రూం ఎక్కడుంది. నా మనుమరాలు నాకోసం చూస్తూవుంటుంది. కొంచెం పిల్చుకురామ్మ" అని అర్ధింపుగా అడిగారావిడ. "ఎవరూ లేనట్లున్నారమ్మా. ఐనా ఓ మారు సూసొత్తాను వుండండి" అని ఆయా క్లాస్ రూం వైపు వెళ్ళింది. "ఈ ఆయా పొరపడివుంటుంది. తను వచ్చేదాకా బుద్ధిగా కూర్చుంటుందిలే. ఎక్కడికి కదలదు" అని ధీమాగా ఎదురుచూడసాగారు ఆవిడ.దూరం నుండి ఆయా ఒక్కర్తే రావడం చూసి కమలమ్మగారి ఆదుర్దా ఎక్కువవ్వసాగింది. "ఎవలూ లేరమ్మా. కలాసురూం ఖాలీ" అని ఆయా చెప్పడంతో ఆవిడకి ముచ్చెమటలు పోసాయి. "సరిగ్గా చూసావా. ఇంకెక్కడైన వుందేమో" అని టెన్షన్ పడసాగారు. ఇంతలో అప్పారావు వచ్చి "పిల్లలంతా ఎల్లిపోనారు బామ్మగారు" అని చెప్పడంతో ఆవిడకి ఒక్కసారి గుండె గుభేలుమంది. "అయ్యొ పిల్ల ఎమైందో. ఎవరైన ఎత్తుకుపొయారేమో. అసలే రొజులు బాగాలేవు. ఇప్పుడు కూతురికి అల్లుడుకి ఎలా మొహం చూపించాలి" అని తల్చుకుంటే ఏడుపు వచ్చింది ఆవిడకి.

కమలమ్మగారికి ఏమిచెయ్యలో పాలుపోవడం లేదు. "కూతురికి చెప్తే? అమ్మో!! ఇది విని తట్టుకోగలదా. పోనీ అల్లుడికి చెప్తే? ఆయన అసలు తట్టుకొలేడు. ఇప్పుడు ఏమి చెయ్యడం?" అని అలోచించసాగారు. చివరికి తన వీధిలోనె అద్దెకి వుండె మనుమరాలి వాళ్ళ క్లాస్ మేట్ జ్యోతి గుర్తుకి వచ్చింది కమలమ్మగారికి. పరుగు పరుగున వాళ్ళ ఇంటి తలుపు తట్టారు. "ఏమ్మా మా మనుమరాలు మీ ఇంటికి ఏమైన వచ్చిందా?" అని అడిగారావిడ."లేదు అమ్మమ్మగారు రాలేదు. స్కూల్ అయ్యాక నేను ఒక్కదాన్నే మా ఇంటికి వచ్చేసా" అని చెప్పింది జ్యొతి.అది విని ఆవిడ ఆందోళన ఇంకా అధికమైంది. ఇంక లాభం లేదని కూతురి ఆఫీసుకి రిక్షా చేయించుకుని వెళ్ళారు.  "అమ్మా ఈ టైములో ఇలా వచ్చావేమిటి? ఒక్కర్తివీ వచ్చావేంటి? పండు ఏది?" అని ప్రశ్నించే సరికి ఆవిడకి దుఖం ఆగలేదు. "పండు కనిపించటం లెదు" అని బావురుమన్నారు. "అమ్మా, ఏమిటి నువ్వు చెప్పేది. ఎక్కడకి వెళ్ళి వుంటుంది. స్కూల్లో సరిగ్గా వెతికావా?" అని పూడుకుపోయిన గొంతుకతో వస్తున్న ఏడుపు ఆపుకుంటూ అడిగింది అమ్మ. "అంతా వెతికే వస్తున్నానమ్మా. ఎక్కడాలేదు" అని బదులిచ్చారు ఆవిడ తన ఏడుపు దిగమింగి. "మళ్ళీ ఇంకోసారి చూసి వద్దాం పదమ్మా" అని రిక్షాలో స్కూల్ కి బయలుదేరారు ఇద్దరూ.

అక్కడ అటెండరు అప్పారావు కనపడ్డాడు మళ్ళీ. "బామ్మగారు ఇలగ వొచ్చారేటండి మళ్ళీ? మీ మనవరాలు కనపడనేదా?" అని అడిగాడు. వెంటనే అమ్మ "లేదయ్యా. ఎల్.కె.జి క్లాస్ టీచర్ వున్నారా? వెళ్ళిపొయారా?" అని అడిగారు. "స్టాఫ్ మీటింగ్ వుందని ఇయ్యాల ఇక్కడె వున్నారమ్మ అందరూ. మీటింగ్ గంట క్రితమే ఐపోనాదమ్మ. కొందరు టీచర్లు ఇంకా పని వుండి స్కూల్ లోనే వున్నారు. ఇక్కడే కూకోండి. పిల్సుకు వొత్తాను." అని లోపలికి వెళ్ళాడు. ఇద్దరికీ కూర్చో బుద్ధి కాలేదు. "ఒకవేళ టీచర్ కి తెలియదంటే ఏమిచెయ్యడం? ఈయనకి చెప్పి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడమే. ఎక్కడికి వెళ్ళుంటుంది నా చిట్టితల్లి?" అని అలోచనలో పడింది అమ్మ.  ఒకపక్క కమలమ్మగారు తనకి తెలిసిన దేవుళ్ళందరికి మొక్కెస్తున్నారు.  ఇంతలో ఎల్.కె.జి క్లాస్ టీచర్ లక్ష్మి వచ్చారు అక్కడికి. "పిల్లలందరు క్లాస్ వదలగానే వెళ్ళి పోయారు మేడం" అన్న ఆవిడ మాటవిని కుప్పకూలిపొయారు ఆవిడ.

"భగవంతుడా!! అనుక్కున్నంతా అయ్యింది. ఇప్పుడు ఏది దారి?" అని స్కూల్ ఆవరణ దాటి రిక్షా లో కుర్చోబొయేంతలో "మేడం. ఒక్క నిమిషం!!" అనే పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చుసే సరికి లెక్కల టీచర్ నీరజ కనిపించారు. "స్కూల్ లో కొత్తగా జాయినైన దీప్తి టీచర్ ఇందాకల పిల్లలు కొందరిని రిక్షాలో ఎక్కించుకుని ఎటో వెళ్ళడం చూసాను" అని చెప్పడంతో ఒక్కసారిగా టెన్షన్ తగ్గి దాని స్థానంలో కోపం చోటుచేసుకుంది అమ్మలో.

దీప్తి టీచర్ ఇల్లు ఎక్కడో కనుక్కుని అమ్మ, అమ్మమ్మ బయలుదేరబోతుండగ ఎదురుగ మిగతా పిల్లలతో గెంతుకుంటూ ఆడుకుంటూ రిక్షాలో  వస్తున్న నన్ను చూడగానే వాళ్ళిద్దరికి ప్రాణం లేచివచ్చింది. ఏడుస్తున్న అమ్మని అమ్మమ్మని చుస్తూనే నేను ఒక్క వుదుటన "అమ్మా! అమ్మమ్మా!!" అని అల్లుకుపోడం, ఇక ఆతరవాత దీప్తి టీచర్ కి అందరూ క్లాస్ తీసుకోడం, ఆవిడ "సారీ అండీ,  మా ఇల్లు స్కూల్ దగ్గరలోనే కదా. పిల్లల్ని సరదాగ ఇంటికి తీసుకు వెళ్ళి కొంచెం స్నాక్స్ పెట్టి ఆడించి తీసుకు వద్దామని అనుకున్నాగాని, మీరంతా ఇలా కంగారు పడతారని అనుకొలేదు" అని సంజాయిషీ ఇవ్వడం జరిగిపొయాయి."పండు... మా బంగారం!!! ఎంత హడలుకొట్టేసావే మా అందరిని??!!!" అని అమ్మమ్మ నన్ను హత్తుకుంది.

No comments:

Post a Comment