Friday, July 8, 2011

అమ్మమ్మ కతలు: మా అమ్మమ్మ ఇంజినీరు!!

సుబ్బమ్మగారి అల్లుడికి విశాఖపట్నం నుండి పాడేరు ట్రాన్స్ఫెర్ అయ్యింది. ప్రభుత్వ క్వార్టర్స్ లో ఖాళీ లేకపొవడంతో ఇంటి వేటలో పడ్డారు. చివరికి ఒక రొజు మొక్కల అప్పారావు వొచ్చి "మీరు ఇల్లు వెతుకుతున్నారటగా చెల్లెమ్మా. మీకు అభ్యంతరం లేక పొతే నా ఇల్లు ఖాళీగా వుంది. సున్నాలు వేయించి ఇస్తాను." అని చెప్పాడు. అది రెండుగదుల పెంకుటిల్లు. ఒక బెడ్రూం, ఇంకొటి వంట గది. ఆ రొజుల్లొ అద్దె ఐదు రూపాయలు వుండేది. ఒక మంచిరోజు చూసుకొని సుబ్బమ్మగారు, అల్లుడు, కూతురు, మనుమలు రాముడు, చంటి ఆ ఇంటిలో అడుగు పెట్టారు.

అవడానికి సుబ్బమ్మగారు ఐదోతరగతి చదివినా చాలామంది కన్నా 'కామన్ సెన్స్ ' ఎక్కువేనని చెప్పొచ్చు. అసలు ఆ కాలం అమ్మమ్మలు అందరూ అంతేనని అనిపిస్తూ వుంటుంది. జరిగిన విషయం చెబితే అవునని ఒప్పుకుంటారు మరి. ఇంట్లోదిగిన తరువాత రెండు రోజులు ఇల్లు సర్దుకోడంతో హడావిడిగా గడిచింది. ఇల్లు విశాలంగా వుండాలా ఏంటి? మనసు విశాలమైతే చాలదూ? అదే ఓ ఇంద్రభవనంలా అనిపించేది. "పెరడు మాత్రం చక్కగా వుందనుకో. ఎంచక్కా ఇక్కడ బీరపాదు, కాకరపాదు వేసుకొచ్చు" అనుకున్నారు సుబ్బమ్మగారు. కాకపొతే చిన్న చిక్కొచ్చింది. అంత వరకు సిమెంటు గచ్చులే అలవాటు పట్నంలో. పెరట్లో బాత్రూం మట్టిగోడతో కింద గచ్చు లేకుండా ఇబ్బందిగా వుండేది.

ఇంతలొ ఎదురింటి పాత్రుడన్న ఇల్లు మరమ్మత్తు చేయిస్తుంటే సుబ్బమ్మగారికి ఓ అలొచన వచ్చింది. "పిల్లలు బాత్రూంలో జారిపడుతున్నారు . కొంచెం సిమెంటు వుంటే ఇద్దు" అని పాత్రుడన్నని అడిగారు. అక్కడి పనులు చేస్తున్న మేస్త్రిని సిమెంటు ఇసుక పాళ్ళు కనుక్కుని పాంగి గాడిని కేకేసి బుంగెడ్డ నుండి ఇసుక తెప్పించారు. "బుడ్డి, ఇప్పుడు తాపి ఎలగి సెస్తావ్" అని పాంగి గాడి ప్రశ్న. మేస్త్రి చెప్పిన విధంగా సిమెంటు ఇసుక కలిపి, ఇత్తడి చెంబు ఒకటి తీసుకుని తాపి చెయ్యడం మొదలు పెట్టారు సుబ్బమ్మగారు. చూస్తుండగనే బాత్రూంలో సిమెంటు నేల తయ్యారవసాగింది. "మొన్న గాలివానకి ఇంటి పైన ఈకులుసాయి (eucalyptus oil ని సుబ్బమ్మగారు అలా పిలుస్తారన్నమాట ) చెట్లు పడి పెంకులు పగిలి కింద పడ్డాయిరా. అవి ఇలా పట్రా" అని పాంగి గాడికి ఆర్డర్ జారిచేసారు సుబ్బమ్మగారు.వాటిని తిరగేసి పెట్టి సిమెంటుతో తాపి చేసి తూము కట్టారు.

ఇదిలా వుండగా ఊర్లో ఎలెక్షన్లు జరిగితే ఎలెక్షన్ డ్యుటీకి వచ్చే జనానికి, లేదా పరిక్ష పేపర్లు దిద్దడానికి వచ్చే టీచర్లకి అక్కడి ఇళ్ళ నుండి భోజనం, స్కూల్ లో వసతి ఇవ్వడం సాధరణం.  విశాఖపట్నంలో వున్నప్పుడు కిరసనాయిలు పొయ్య మీద వంట అలవాటు. పాడేరు వచ్చాక వచ్చెపొయ్యె జనంతో  వంటకి ఇబ్బంది పడసాగారు. దానితో మరో మారు సుబ్బమ్మగారు తన బుర్రకి పదును పెట్టారు.  "ఒరేయ్ పాంగి, పెయ్యల్ గెడ్డనుండి కొంచెం బంకమన్ను తెచ్చుకురా" అని చెప్పి మన్ను కుమ్మి దానితో ఓ రెండు వంటపొయ్యలు కట్టారు.

ఆ తరువాత ఇంక సుబ్బమ్మగారు వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో కట్టి పడేసారు. వంటింట్లో దేవుడు పెట్టుకోడానికి  ఓ గట్టు,  సామాను పెట్టుకోడానికి ఒక గూడు, బాత్రూంలో వెణ్ణీళ్ళూ కాచుకోడానికి కర్రల పొయ్య ఇత్యాది అన్నమాట.

1 comment:

  1. చాలా తెలివైన అమ్మమ్మ !

    ReplyDelete