Saturday, April 27, 2013

ఎక్కడ వుంది లోపం?

'నిర్భయ' సంఘటనతో జనం అందరు ఒక్కసారిగా మేల్కొన్నారు. మంచి మార్పే కాని ఈ మార్పు ఎన్నాళ్ళు? బహుశా లోపం ఎక్కడుందో తెలుసుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదేమో!! పరిష్కారం చెప్పేంత శక్తీ నాకు లేకపోవచ్చు కాని నా మనసులో మాట చెప్పాలని ఒక ప్రయత్నం .

ప్రతి తల్లితండ్రి తమ బిడ్డలని పెంచే విధానంలో ఉందేమో ఇదంతా!! శీలం, మానం, పరువు అనే రెండు పదాలకి తప్పు అర్ధాన్ని నేర్పుతున్నాం మనమ్. శీలం శరీరానికి సంబంధించిన విషయమా? కాదు!! అది నా ఉద్దేశ్యం లో మనసుకి సంబంధిచినది. అది ఆడ-మగ ఇరువురికి అవసరం. మొన్న ఈ మధ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వినడం జరిగింది.కామమైన, అర్ధమైనా ధర్మంతో ముడిపడితేనే అది సరైనది. కాబట్టి  కేవలం మగవాడైనంత చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని ఏ ధర్మమూ, శాస్త్రము చెప్పలేదు. మన సమాజం మాత్రం ఒక మానభంగం జరిగితే కేవలం ఆడదాన్ని తప్పుపడుతోంది. పరువు పేరుతో ఆ కుటుంబాన్ని తలెత్తుకొనివ్వదు. సమాజం, కుటుంబం ఏమంటాయో అనే భయంతో జీవితం ముగించేవారెందరో. ఎందుకీ దుస్థితి?

స్త్రీని శక్తి రూపంగా పూజించే మనం, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అని చెప్పుకునే మనం... ఒక స్త్రీకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వవలసింది పోయి ఆత్మహత్య శరణ్యం అనుకునే స్థితి ఎందుకు కల్పిస్తున్నాం? అత్యాచారానికి గురైతే జీవితం నాశనం ఐనట్లేనా? ఆ షాక్ నుండి తేరుకునే సహాయం ఎందుకు చెయ్యం? అన్ని విషయాలలో పాశ్చాత్యులను అనుకరించే మనం వాళ్ళ దుస్తుల్ని, వేషధారణ ని విమర్శించే మనం వాళ్ళ దగ్గరున్న మంచిని తీసుకొము. రోడ్ మీద, బస్సు లో, కార్యాలయాల్లో, కళాశాలలో ఇలా ఎక్కడ వెళ్తున్న రోజు లైంగిక వేధింపులకి గురయ్యే ఆడవారు భారత దేశం లో ఎందరో. కాని పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా తక్కువ. అది చూసి సిగ్గు పడాలి. అత్యాచారానికి గురయ్యే ఆడవారిని అక్కడ వివక్షకి గురిచెయ్యరు. కౌన్స్లింగ్ లాంటివి ఇచ్చి ఆ షాక్ నుండి తేరుకునే అవకాశం కల్పిస్తారు.

పాశ్చాత్య వస్త్రధారణ వేసుకునే ఆడవారు మాత్రమే ఇలాంటి వేధింపులకి గురవుతున్నారని చాలా మంది విమర్శించడం చూస్తూవుంటే ఎంతో హాస్యాస్పదం గా వుంటుంది. వావి-వరసలు, వయస్సు మరచి ప్రవర్తించే వారికి ఇవి పట్టవు అనడానికి ఒక ఉదాహరణ ముక్కు పచ్చలారని పసి పిల్లలమీద కూడా మృగాల్లా ప్రవర్తించే నీచులు. ఇటువంటి వారందరినీ వెలివెయ్యకుండా దారుణానికి గురైన ఆడవారిని ఎందుకు వెలివేస్తున్నారు? బహుశా అక్కడే వుంది లోపం. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఆ ఆడవారికి కొండంత ధైర్యం ఇవ్వడం లేదు మనమ్. పిరికి మందు నూరి పోస్తున్నాం. మానభంగం చేసిన వాడితో తాళి కట్టించుకుంటే సమస్య తీరినట్లు చూపే సినిమాలు, పెద్దలు ఉన్నంత వరకు ఈ జడం పోదు.


Monday, July 23, 2012

మిథునం - నా జ్ఞాపకాలు



 ఇవాళ ఆదివారం కావడం తో టీవీ లో మంచి ప్రోగ్రామ్స్ ఏమున్నాయా అని ఛానెల్స్ మారుస్తుంటే "కుదిరితే ఓ కప్పు కాఫీ" అనే కార్యక్రమంలో తనికెళ్ళ భరణి గారితో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆయన బాపు రమణ ల "మిథునం" అనే నవలని తెరకెక్కిస్తున్నారు. అది తెలిసి చాల ఆనందం అనిపించింది. నాకు బాగా నచ్చిన కథ అది.

భోజనం చేసి కాసేపు పడుకుందామని కళ్ళు మూసుకుంటే "మిథునం" గుర్తుకు రాగానే ఎందుకో కృష్ణ స్వామిగారు, వాళ్ళ ఆవిడ గుర్తుకొచ్చారు నాకు. కృష్ణ స్వామిగారు మా నాన్నగారు మంచి స్నేహితులు. ఇద్దరు ఒక ఈడువారనుకునేరు. మా నాన్నగారు కృష్ణ స్వామి గారికంటే ఓ ఇరవయ్ సంవత్సరాలు చిన్నవారు. 


 మేము అప్పుడు కాకినాడలోవుండేవాళ్ళం. ఆయన,  మా నాన్నగారు ఒకే డిపార్టుమెంటు లో పని చేస్తూ వుండే వారు. ఆ ఏడు వర్షాలు పడి కృష్ణ స్వామి గారి ఇల్లు వరదల్లో కొట్టుకుపోయిందిట.మళ్ళి ఇల్లు కట్టుకోవడానికి పెద్ద మొత్తం లో డబ్బు అవసరం పడి ఎవరిని అడగాలా అని సంకోచిస్తూ కృష్ణ స్వామి గారు మా నాన్నగారిని అడగడం, అపుడు మా అమ్మ తన గాజులు లోన్ పెట్టి ఆ డబ్బు సర్దుబాటు చెయ్యడం తో వారి స్నేహం మొదలయ్యింది. కొద్ది నెలల తరువాత ఒక రోజు కృష్ణ స్వామి గారు మమ్మల్ని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. 

రిక్షా కట్టించుకుని మంచి ఎండలో ఒక అరగంట ప్రయాణం తరవాత ఊరి చివర  ఇంటి ముందు మేము దిగాం. కర్రల తో దడి కట్టి, ఇంటి చుట్టూ పచ్చగా మొక్కలు, మధ్యలో పర్ణశాలని తలపిస్తూ మట్టి గోడల తో, సున్నం తో రంగవల్లికలు వేసి, పైన తాటాకు పరచిన ఆ ఇంటిని చూస్తే ముచ్చట అనిపించింది. వాకిట్లో ఎదురుగా కృష్ణ స్వామి గారి భార్య లక్ష్మమ్మ నవ్వుతూ మమ్మల్ని లొపల కి ఆహ్వానించారు. చేతులకి నిండుగా గాజులు, నుదుటన పెద్ద  బొట్టు, నేత చీర, మెళ్ళో మంగళసూత్రం , నల్లపూసలు పేరుకు తగ్గట్టు వున్నారావిడ. మంచి నీరు ఇచ్చాక "ముందు భోజనాలు చేసాక కబుర్లు చెప్పుకుందాం" అని ఆవిడ మా అందరికి విస్తట్లో అన్నం వడ్డించారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు కడుపునిండా తిన్నాక, మా పెరడు చూద్దురుగాని రండి అని నన్ను అమ్మని తీసుకెళ్ళారు.

 అక్కడ తులసి కోట, చుట్టూ ఉన్న మంచి పూల చెట్లు చూసి లోపలికి రాబోతుంటే "లక్ష్మి! మన సుధకి నీళ్ళు పెట్టావా?" అని కృష్ణస్వామి గారు వాళ్ళ ఆవిడనికేకేశారు. "ఈ సుధ ఎవరబ్బా?  బహుశా ఓ రెండు జడలు, గౌన్ వేసుకుని ఏ పిల్లైన ఇటు వస్తుందేమో" అని నేను చూస్తుంటే  "ఏవిటలా చూస్తున్నావ్ పాపా  , పద సుధకి నీళ్ళు పెట్టి వద్దాం" అని లక్ష్మమ్మ గారు పెరటికి పక్కన చిన్నదారిగుండా నన్నుఅమ్మని  తీసుకెళ్ళారు. ఇద్దరం ఒక పాక ముందు ఆగాం.ఓ గేదె తప్ప నాకు ఏమి కనిపించలేదు. "సుధా అంటే మా గేదె" అని నన్ను మా అమ్మని చూసి నవ్వుతూ చెప్పారావిడ. మళ్ళి ఇంట్లో కి వెళ్ళాక "తెల్లోడు , బండోడు, నల్లోడు ఎక్కడా? వాళ్ళకి కూడా అన్నం పెట్టు. ఎప్పుడు తిన్నారో ఏంటో"  అని కృష్ణ స్వామిగారు అడిగారు. "ఎక్కడికి పోయారో ఏంటో, బహుశా ఆడుకుని మంచాల కింద  నిద్రపోయి వుంటారు " అని ఆవిడ దుప్పటి ఎత్తి మంచాల కింద వెతుకుతున్నారు. చొక్కా నిక్కరు వేస్కొని ఓ ముగ్గురు మగపిల్లలు మంచాల కింద నుండి వస్తారని నేను చూస్తుంటే, ఒక కుక్క రెండు పిల్లులు వచ్చాయి బయటకి. పిల్లులు బద్ధకంగా  వొళ్ళు విరుచుకుని తోకలు పైకెత్తి నెమ్మదిగా "మ్యావ్!" అని అరిచి పెరట్లోకి వెళ్ళాయి. కుక్క మాత్రం మంచి ఠీవీగా నడుచుకుంటూ వెళ్ళింది. నేను వాటి వెనకాలే వెళ్లాను. లక్ష్మమ్మగారు వాటికి ఓ ప్లేట్ లో అన్నం పెట్టారు. అవి ఆవురావురు మని తిన్నాయి. తరవాత పక్కనవున్న గోళెం లోంచి నీరు తాగేసి పెరట్లోకి పారిపోయాయి. నేను కూడా పరుగెత్తి వాటి వెనకాల వెళ్లాను. గేదవున్న పాక ముందునుండి నడిచి వస్తే, ఇంటి ముందర వున్న మొక్కల మధ్యకి వచ్చా. అక్కడ చిన్న చంద్రకాంతం మొక్కలు కనపడ్డాయి. కొన్ని చంద్రకాంతం పూలు, కొన్ని చంద్రకాంతం విత్తనాలు  కోసుకొని దోసిట్లో పట్టుకొచ్చిఅరుగు మీద పెట్టి కూర్చున్నా. ఒక్కో పువ్వుకాడ పీలిస్తే అందులో తుమ్మెదలు దాచుకున్న తేనే తియ్యగా నా నోట్లోకి వచ్చింది. మళ్ళి మొక్కల మధ్యలోకి వెళ్లి కాసేపు మట్టితో ఆడుకుంటే ఎర్రగా ఏదో కనిపించింది. తవ్వి చుస్తే అక్కడ బోలెడు గురువింద గింజలు కనిపించాయి. అవన్నీ ఏరి చిన్న రుమాలు లో కట్టాను. "ఎక్కువ సేపు ఎండలో ఆడకు కన్నా. త్వరగా లోపలకి వచ్చేసెయ్ " అని చెప్పి అమ్మ లోపలకి వెళ్ళిపోయింది.

అరుగు మీద కూర్చున్న నాకు ఇంట్లోంచి కబుర్లు వినిపిస్తున్నాయి. కృష్ణస్వామి గారు, వాళ్ళ ఆవిడ వరదలు తగ్గాక, స్వయంగా మట్టి తొక్కి  ఆ ఇల్లు మళ్ళి కట్టారుట. వాళ్ళు జంతు ప్రేమికులని మాటల్లో తెలిసింది. అంతే కాదు, ఇద్దరిది ప్రేమ వివాహమని, ఇద్దరు పిల్లలు వున్నా, మరో ఇద్దరు అనాధల ని చేరదీసి పెంచి చదివించి, పెళ్ళిళ్ళు  చేసారుట. ఎంత మంచి మనస్సో. ఆ వయసులో నాకు అంతగా అర్ధం కాకపోయినా, ఇప్పుడు తలచుకుంటే చాల ముచ్చటేస్తుంది. ఆ ఇల్లు, పచ్చని చెట్లు, తెలుగింటి భోజనం  తలచుకుంటే మిథునం కథలో ఇంటి పెరడు గుర్తుకు వస్తుంది నాకు.


Friday, March 23, 2012

అనగా అనగా ఓ ఫేస్ బుక్ కథ

చాలా రోజుల క్రితం మాట ఇది. పక్క రూం లో వున్న వ్యక్తి కి  కూడా ఎస్. ఎం. ఎస్ లు యిచ్చుకునే ఈ కాలం జనాన్ని చుస్తే నాకు జాలి.  ఓ ఇన్లాండ్ కవర్ మీదో, కార్డు మీదో చక్కగా వుత్తరం చూసి ఎన్ని రోజులైందో. కనీసం మెయిల్ కూడా చెక్ చెయ్యడానికి చిరాకు పడే నేను, నా స్నేహితుల పోరు పడలేక ఫేస్ బుక్ ఎకౌంటు తెరిచా. ఎకౌంటు అయితే తెరిచాను కాని ఎన్నడూ వాడిన పాపాన పోలేదనుకోండి. "ఒరేయ్  శీను ఏంట్రా నువ్వు ఇంకా పాతకాలం మనిషిలా ఉత్తరాలు పత్తరాలు అని వేలాడతావ్!" అని  నా బంధువులు, స్నేహితులు ఒక్కటే  ఏడిపించడం. మా ఆవిడ కూడా "ఏమండి నేను, నా ఫ్రెండ్స్ అందరమూ ఇందులో వున్నాం. మీ వారు ఫేస్ బుక్ వాడరా అని అందరు ఎగతాళి చేస్తున్నారు. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ" అని మా ఆవిడ  కూడా అనేసరికి ఇక నాకు తప్పలేదు. సరే ఈ ఫేస్ బుక్ సంగతేదో చూద్దామని నిశ్చయించుకున్నా.

ఆ రోజు శనివారం కావడంతో ప్రొద్దుటనుండి కూరలు తేవడం, బిల్లులు కట్టడం వగైరా పనులన్నీ అయ్యాక భోజనం చేసి కూర్చున్నాక, మా ఆవిడతో "ఏమోయ్ ఓసారి  ఫేస్ బుక్ లో లాగిన్ అవుతా. ఏది ఆ లాప్ టాప్ ఇలా అందుకో" అని అనగానే మా ఆవిడ మొహం ఆనందం తో వెలిగిపోయింది. "హమ్మయ్య ఇన్నాళ్టకి మీకు తీరిక దొరికింది. ఇదిగోండి. ఊరందరిది ఓ దారైతే ఉలిపికట్టెది ఓ దారి అన్నట్టు కాకుండా నలుగురిలాగే ఫేస్ బుక్ వాడితే బాగుంటుంది. ఎకౌంటు తెరిచి వదిలెయ్యడం కాదు" అని ఓ సలహా పారేసి ఎంచెక్క ముసుగు తన్ని పడుకుంది మా ఆవిడ.

నా ప్రొఫైల్ లో కి వెళ్లి చూడగానే చాల ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెండింగ్ లో వున్నాయి. నా చిన్ననాటి స్నేహితుల దగ్గరనుండి, నా క్లాస్మేట్లు,  ఎదురింటి సుబ్బారావుగారు, పక్కింటి రాజారామ్, ఆఫీసులో పనిచేసే నా సహచరులు నుండి, నా సహధర్మచారిణి వరకు. అవన్నీ టకటకా కన్ఫర్మ్ చేసేసా. హమ్మయ్య ఒక పనైపోయింది. జన జీవన స్రవంతి లోకి వచ్చి పడ్డా. ఎటొచ్చి చిక్కల్లా ఈ పోస్ట్ల తోనే. "ఏమి రాయాలబ్బా" అని చాలా సేపు ఆలోచించా. ఎంత ఆలోచించిన ఒక పట్టాన అర్ధం కాలేదు. బుర్ర వేడెక్కి పోయింది. వెళ్లి ఒక కప్పు కాఫీ కలుపుకొస్తే గాని ఐడియా తట్టదేమో. కాఫీ పూర్తి చేసాక ఒక ఆలోచన వచ్చింది. మిగత వారు ఏమి రాసారో చుస్తేనో. "అద్భుతం!! మంచి ఆలోచన" అంది నా మనస్సు. అందరి పోస్ట్లు చదవడం మొదలెట్టా.

"ఇవాళ మా కోడి పెట్టిన గుడ్డు తో ఆమ్లెట్ వేసా. వావ్ రియల్లీ గుడ్" అని నా ఆఫీసు లో సత్తి గాడి కామెంట్. కింద ఐఫోన్ తో తీసిన కోడి ఫోటో, దాని పక్కనే ప్లేట్ లో ఆమ్లెట్ ఫోటో. అందరు తమ సాయశక్తుల లైక్ లు, కామెంట్స్ ఇచ్చేసారు. "మాకు ఎప్పుడు తినిపిస్తావ్" అని ఒకరు. "నువ్వే చేశావా లేక హోటల్ నుండి ఆర్డర్ చేసి ఫోటో పెట్టావా" అని ఇంకొందరు.

ఇంకో పోస్ట్లో  మా ఫ్రెండ్ ఒకడు జలుబు చేసిందని రాస్తే, ఇంకోడు కాలు బెణికిందని రాసాడు. మా ఆవిడ చెల్లెలి కూతురు ఉదయం లేచిన దగ్గరనుండి పడుక్కునే వరుకు దినచర్య మొత్తం రాసి పడేసింది. సరే ఇదేదో బాగానే వుంది. నేను ఈ మాత్రం రాయలేనా అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా.

సరే ఇంకో పోస్ట్ చూస్తే అది మా ఆవిడ రాసినది. "ఈ కుక్కపిల్ల తప్పిపోయి నా పొలంలోకి వచ్చింది. ఎవరైనా దత్తతు తీసుకోండి" అని రాసింది. "సుజాత ఫలానా పంట పెంచి ఇన్ని పాయింట్లు గెల్చుకుంది" అని ఇలా రకరకాలు ఒక పది పోస్ట్లు అవే వున్నాయి."సుజీ, ఏంటి నువ్వు జీవ కారుణ్య సంఘం లో, రైతు సంఘం లో ఎప్పుడు చేరావ్. చెప్పలేదు?" అన్నా.  దుప్పటి ముసుగు తీసి చూసి "ఏంటండి కలగాని కంటున్నారా. బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు" అని లేచింది విసుగ్గా. "అది కాదోయ్ ఇలా చూడు. నువ్వే గా ఫేస్ బుక్ లో పెట్టావ్" అని పోస్ట్లు చూపిస్తే ఒక్కసారి ఉలిక్కిపడి "అయ్యో నా మతి మండ. మొక్కలకి నీళ్ళు పోయ్యలేదండి. ఈ పాటికి వాడిపోయి ఉంటాయి" అని ఒక్క ఉదుటన నా చేతిలోంచి లాప్ టాప్ లాగేసుకుని తన ఎకౌంటు లో లాగిన్ అయ్యి యేవో చూస్తోంది. తీరా తేలిందేమిటంటే అదేదో ఫారంవిల్ అని ఒక ఆట అని చెప్పింది. ఇదేమి విచిత్రం చెప్మా. నిజం మొక్కలు పెంచితే పువ్వులో పళ్ళో ఇస్తాయి గాని పనికిరాని ఈ ఆటలేంటి. ఇంతలో మా తమ్ముడి కొడుకు ఫోన్ చేసాడు ఏదో పని మీద. అదే విషయం వాడితో అంటే "నీకు తెలియదా పెదనాన్నా, ఈ ఆటకి క్రెడిట్ కార్డు తో పాయింట్స్ కొనుక్కోచ్చు. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇలాంటి ఆటలకి గిఫ్ట్ కార్డ్స్ కూడా అమ్ముతారు" అని చెప్తే దిమ్మతిరిగింది. "అమెరికా వాడిని చూసే నేర్చుకోవాలి వ్యాపారమంటే" అని మా చినన్నఅంటుండేవాడు. నిజమేనన మాట. సరే నాకెందుకు ఈ గోల. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి మా ఆవిడ నా చేతిలో లాప్ టాప్ పెట్టి వెళ్లి పోయాక తిరిగి నా ఎకౌంటు చూడడంలో మునిగిపోయా.

Tuesday, August 16, 2011

విజేత

అలారం మోగడంతో మెలుకువ వచ్చింది పరిమళకి. ఇంకాసేపు ముసుగు తన్ని పడుకుందామని అనుకుంది. ఇంతలో ఆఫీసు గుర్తుకు వచ్చేసరికి నిద్ర కాస్త ఎగిరిపోయింది. "హు ఇవాళ ఇంకా గురువారం. మరో రెండ్రోజులు ఎలాగో ఆఫీసుకి వెళ్తే, ఆదివారం వచ్చేస్తుంది. హాయిగా గుర్రుపెట్టి పడుకోవచ్చు" అని మనసుకి సర్దిచెప్పుకుంది. చకచకా వంట, స్నానం, టిఫిన్ ముగించి పిల్లలికి, భర్తకి, తనకి డబ్బాలు సర్ది చెప్పులేసుకుంటూ "ఏవండి, ఆఫీసుకి వెళ్తున్నా. పిల్లల స్కూల్ ఆటో ఇంకో పది నిమిషాలలో వచ్చేస్తుంది. వాళ్ళని ఎక్కించి మీరు ఆఫీసుకి వెళ్ళండి" అని భర్త మధుకి చెప్పి బస్ స్టాప్ కి పరుగెత్తింది. అసలే ఎండాకాలం. ఉక్కపోతగా వుంది. దానికి సాయం బస్ జాడ ఇంకా లేకపోడంతో వుసూరుమనిపించింది పరిమళకి. ఇంతలో ఆఫీసులో స్వాతి గుర్తుకురాగానే చిరాకు పుట్టుకువచ్చింది.

 పరిమళ, స్వాతి ఇద్దరు ఒకే ఆఫీసులో గత పదేళ్ళగా పని చేస్తున్నారు. మొదట్లో స్వాతి బాగానే మాట్లాడేది. కాని రాను రాను ఆమెతో మాట్లాడగా పరిమళకి ఒక విషయం అర్ధమయింది. ఆమె ప్రతిదానికి ఇతరులతో పోల్చుకుని తను గొప్ప అని ఫీల్ అవుతూ వుంటుంది. తను చెప్పింది కరెక్ట్ అనే రకం. కాదని ఎవరైనా ఏదైనా చెప్పబోతే వాళ్ళని హేళన గా మాట్లాడుతూ వుంటుంది. పరిమళ స్వతహాగా నెమ్మదస్తురాలు కావడంతో స్వాతిని ఎదురుకోవడం ఆమెకి ఒక రకంగా కష్టమైన విషయం. అందుకనే స్వాతికి సాధ్యమైనంత దూరంగా మసలుతుంది. కాని పక్క సీట్ కావడంతో ఒక్కోసారి దొరికి పోతూ వుంటుంది. ఆలోచనల్లో ఉండగానే బస్ వచ్చేసింది. సీట్ దొరకడంతో పరిమళ అందులో కూలబడింది. కర్చీఫ్ తో మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వుండగా పరిమళ కి మొన్న జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది.

ఆ రోజు తమ ఆఫీసులో క్లెర్క్ రాణి కొత్త నెక్లస్ పెట్టుకు వచ్చింది. లంచ్ అవర్లో మిగతా ఆడవాళ్ళందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నా, స్వాతి మాత్రం నెక్లస్ మా అమ్మమ్మ కాలం మోడల్లాగా వుంది అంటూ వెటకారం చేసింది. సాయంత్రం ఆఫీసు ముగిసేముందు మేనేజర్ వచ్చి "స్టార్ అఫ్ ది వీక్" అవార్డు ప్రకటించారు . స్టాఫ్ లో ఉత్సాహం నింపడానికి ఈ మధ్యే కొత్తగా ఈ అవార్డు మొదలుపెట్టారు. ఈ అవార్డు అందుకున్న వాళ్ళకి స్టార్ హోటల్లో ఒక జంటకి డిన్నర్ ఫ్రీ. ఆ వారం అవార్డు పరిమళకి వచ్చింది. మేనేజర్ పరిమళని విజేత గా అనౌన్స్ చెయ్యగానే అంతా కంగ్రాట్స్ చెబుతూ వుంటే స్వాతి మాత్రం దూరంగా ఏదో పని ఉన్నట్టు వేరే సెక్షన్లో గడిపింది. మరునాడు ఆఫీసు కి వచ్చాక కూడా ఏమి మాట్లాడలేదు.

అలాంటిది నిన్న సాయంత్రం ఆఫీసు నుండి బయలుదేరేటప్పటికి ఎందుకో స్వాతి చాలా ఉత్సాహంగా కనిపించింది. పని ముగించి బయలుదేరబోతున్న పరిమళని చూసి "ఏయ్ పరిమళ, నీకో విషయం చెప్దామంటే ఏంటి అప్పుడే వెళ్లి పోతున్నావ్. నిన్న అవార్డు వచ్చిన ఆనందంలో ఇవాళ పని డుమ్మా కొట్టావా" అని అడిగేసరికి పరిమళకి చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకొని "లేదు అయిపోయింది. కొంచం తలనెప్పి గా వుందని" ఎలాగో తప్పించుకు వచ్చింది. "దేవుడా ఇవాళ దొరికి పోడం ఖాయం" అని అనుకుంటూ వుండగా తన దిగవలసిన స్టాప్ వచ్చేసింది. "ఆఫీసుకి వెళ్లి స్వాతి చూడకుండా నెమ్మదిగా తన సీట్లో కూర్చోవాలి. ఇంకో అరగంటలో ఎలాను మీటింగ్ వుంది కాబట్టి మధ్యాహ్నం దాక దీని సుత్తి తప్పించుకోవచ్చు" అనుకుంది. జాగ్రత్తగా బాగ్ సీట్ పక్కన పెట్టి ఊపిరి పీల్చుకుంది.  సీట్లో కుర్చోబోతుండగా "పరిమళా!!" అని స్వాతి గొంతు విని రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తూ ట్రాఫ్ఫిక్ పోలీసుకి  పట్టుబడ్డదానిలాగా ఉలిక్కిపడింది పరిమళ.

"ఏయ్ పరిమళా, నీకో విషయం చెప్పాలని నిన్నటి నుండి ప్రయత్నిస్తున్నా. నాకు మావారికి ఉత్తమ జంట అవార్డు వచ్చింది తెలుసా. మాకు డిన్నర్ ఏం ఖర్మ ఏకంగా ఐదు రోజులు ఊటీలో వసతి, భోజనం ఫ్రీ" అని ఊదరగొట్టేసింది. "అవునా!! ఇంతకి ఎప్పుడు పాల్గొన్నారు పోటి ఎక్కడ జరిగింది?" అని అడిగింది పరిమళ ఉండబట్టలేక. "పోటి గీటి జాంత నై. మావారికి నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చిందిట . ఇవాళ సాయంత్రం హోటల్ హాలిడే వ్యూలో అవార్డు ప్రదానం, డిన్నర్. వచ్చాక అన్ని వివరాలు చెప్తాన్లే" అని గర్వంగా చెప్పింది. "అదేంటి స్వాతి, ఏ పోటి లేకుండా ఉత్తినే అవార్డు ఎందుకిస్తారు?" అని అడిగిన పరిమళని పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది. "లక్కీ డ్రా లో విజేతలుగా మమ్మల్ని ప్రకటించారు" అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో మీటింగ్ టైం అవడంతో పరిమళ ఇంక ఆ విషయం అక్కడితో ముగించడం మంచిదని "అవునా!!కంగ్రాట్స్!!" అని చెప్పి మీటింగ్ రూం వైపు నడిచింది. పని ముగించుకుని వెళ్తున్న పరిమళకి సీట్లో స్వాతి కనిపించకపోవడంతో బహుశా హోటల్ కి  వెళ్ళడం కోసం ఇంటికి త్వరగా వెళ్ళిపోయివుంటుంది అని అనుకుంటూ బస్ స్టాప్ కి నడిచింది. 

స్వాతి మరునాడు ఆఫీసుకి వచ్చిందన్న మాటేగాని ఎంతకీ జాడలేదు. లంచ్ టైములో కూడా సీట్లోంచి కదలలేదు. స్వాతి తత్త్వం తెలిసిన పరిమళకి ఇది వింతగా అనిపించింది. "కొంచం అవకాశం వచ్చినా వదలని స్వాతి ఇవాళ ఉలుకు పలుకు లేదేంటబ్బా? ఒక వేళ వంట్లో బాగాలేదా?" అనుకుంది. "ఉహు, అలా కనిపించట్లేదు. మరి ఏమై ఉంటుంది?" అని ఆశ్చర్యపోయింది. "మెల్లగా కదిపి చూస్తే సరి. అమ్మో! ఒకవేళ తనని ఏమైనా అంటే? కాని ఎలాగైనా తెలుసుకోవాలి" అని నిశ్చయించుకొని స్వాతిని సమీపించింది.


"స్వాతి నిన్న ఫంక్షన్ బాగా జరిగిందా? ఏమిటి విశేషాలు?" అని అడగ్గానే అడిగిందే తడవుగా పెద్ద ఉపన్యాసం దంచే స్వాతి ముందు ఏమి మాట్లాడలేదు. కొంచం కదపగా తిట్లవర్షం మొదలుపెట్టింది. వివరంగా చెప్పమని పరిమళ అడగ్గా "అంతా వుట్టి నాటకం. ఉత్తమ జంటా నా ముఖమా. వెళ్ళగానే ఒక లేడి ఎదురొచ్చి మమ్మల్ని ఆహ్వనించగానే ఎంతో మురిసిపోయాం. చాల సేపు మమ్మల్నిఒక చోట వెయిట్ చేయించారు. ఏది వేదిక ఎక్కడ? అతిథులు ఏరి? అని నిలదీస్తే అవార్డు ప్రదానం ఏమి కాదు. మీరు ఊటీకి ట్రిప్ గెల్చుకున్నారు. అది మీకు డిన్నర్ తరవాత అందచేస్తాం. ముందు మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలి అన్నారు. తీరా చూస్తే మీరు ఈ రిసార్ట్ కి మెంబెర్ షిప్ కి  ఇంత డబ్బుకట్టండి. అప్పుడు మీకు అందులో ఐదు రోజులు వసతి, భోజనం ఫ్రీ అన్నారు. కట్టమంటే కనీసం రిజిస్ట్రేషన్ కి డబ్బు కట్టమన్నారు. నేను మావారు గట్టిగా తగువు పడేసరికి భోజనం కూడా పెట్టకుండా పంపించేసారు. ఇంటికి వచ్చి వండే ఓపికలేక ఆ హోటల్లోనే బిల్ కట్టి తినేసి వచ్చాం" అని ముగించేసరికి పరిమళకి నవ్వాగలేదు. 

Sunday, July 31, 2011

షాపింగ్ వేదాంతం

 షాపింగ్ అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకువచ్చేది ఆడవాళ్ళు. నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు వున్నారు. వారిద్దరూ షాపింగ్ కి వెళ్ళారంటే ఒక పట్టాన రారు. ఒకసారి వాళ్ళతో షాపింగ్ కి వెళ్లాను. మాతో ఇంకా కొందరు స్నేహితులు కూడా వచ్చారు. వీరిద్దరూ ట్రయల్ రూం లోకి వెళ్లి ఎంతకిరాలేదు. తీరా వచ్చాక మేము సరదాగా లెక్కపెట్టి చూద్దుము కదా ఇద్దరు కలిసి ఒక తొంభై రకాల బట్టలు ట్రయల్ వేసి చూసారు.  వీళ్ళ దుంప తెగ!! ఎంత ఓపిక అని ఆశ్చర్య పోడం మా వంతయింది. నాకు ఒక కజిన్ వుంది. తను అయితే అన్ని పెర్ఫెక్ట్ గా వుంటే తప్ప కొనదు. ఆమెతో షాపింగ్ కి వెళ్ళాలంటే బాగా తిరిగే ఓపిక వుండాలి. ఒకసారి చెప్పులు కొనడానికి వెళ్ళింది. రోజంతా చెప్పులరిగి పోయేలాగ తిరిగి తిరిగి ఆఖరికి ఓ చెప్పులజత కొంది.

అయితే ఈ షాపింగ్ పిచ్చికి ఆడ మగ అనే తేడా ఉండదని కొందరిని చూసాక అర్ధం అయ్యింది లెండి. కాక పోతే ఎంచేతో ఆడవారిని ఈ విషయంలో బాగా 'అన్ పాపులర్' చెయ్యడం జరిగిందని నా అభిప్రాయం. ఇక కొందరైతే ఇది అవసరమా కాదా అని కూడా ఆలోచించరు. నచ్చితే వెంటనే కోనేస్తూ వుంటారు.  అంతే కాక షాప్ లో వున్న సరుకంతా తిరగదోడి అన్ని చూస్తే తప్ప వాళ్ళకి మనశ్శాంతిగా అనిపించదు.మరి కొందరు వుంటారు. వాళ్ళు తమతో షాపింగ్ కి వచ్చిన వాళ్ళు కొంచం ప్రోత్సహిస్తే చాలు రెచ్చిపోయి కొనేస్తారు. అది వారి ఇష్టం అనుకోండి. 

నా విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఎందుకో షాపింగ్ ఆంటే అంతగా పడదు. 'షాపింగ్ అంటే ఇష్టం లేదు అనే దాన్ని నిన్నే చూసాం' అని నా స్నేహితురాళ్ళు అంటూ వుంటే నవ్వేసేదాన్ని. నేను కాలేజీ పూర్తి  చేసి ఆఫీసు లో జాయిన్ అయ్యేవరకు మా అమ్మ సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకోనేదాన్ని. ఎందుకంటే మా అమ్మ అంత బాగా సెలెక్ట్ చేస్తుంది. అలా అని నేను అస్సలు షాపింగ్ చెయ్యను అని కాదు. ఇది కొనాలి అని అనుక్కుంటే అదే కొనేసి షాప్ నుండి బయటకి వచ్చేస్తానన్న మాట. నచ్చక పోతే మాత్రం అక్కడ ఎక్కువసేపు ఉండను. 

 నేను ఏడాది క్రితం ఒకసారి టీవీ లో 'ఒఫ్రా వినఫ్రెయ్ షో' చూడడం జరిగింది. ఆ షో టాపిక్ ఏంటంటే 'కొందరు జనాలు అవసరం లేక పోయిన ఎందుకు వస్తువులు కొంటారు' అని. ఆఖరికి తేలింది ఏంటంటే వారి జీవితాలలో ఏదో లోటు భర్తీ చెయ్యడం కోసం వస్తువులతో ఇంటిని నింపేస్తూ వుంటారట. చాల మంది 'షోపహోలిక్స్' ని (షాపింగ్ వ్యసనం ఉన్నవారిని) ఇంటర్వ్యూ చేసి ఈ విషయం తేల్చారు. ఆ తరవాత మరి కొన్ని రకాల షోలు చూడడం జరిగింది. కొందరు అవసరం లేని వస్తువులని పారేయకుండా ఇంటిని నింపేసి చెత్త గా ఉంచుతారు. దానిని 'హోర్డింగ్' అని పిలుస్తారు. ఇది ఒక మానసిక సమస్య. ఏదో తీరని మానసిక వ్యధలే కారణం.

మనిషి జీవితం చాల చిన్నది. కాని మనిషికి తాపత్రయం ఎక్కువ. ఎన్నో కోనేసుకోవాలని ఆశ. నిజంగా ఒక మనిషికి ఇంత సామాను అవసరమా? ఆ షో చూసాక కొద్ది రోజులు ఇలా వేదాంతంలోకి వెళ్ళిపోయా. అది నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే అనవసరంగా ఏది కొనకూడదు అని గట్టి నిర్ణయం తీసేసుకున్నా.  కొద్ది రోజులు చాల స్ట్రిక్ట్ గ పాటించా కుడా. కాని కుక్క తోక వంకర. ఏదో సేల్ పెట్టాడని ఆ మరుసటి వారమే బట్టలు కొన్నాను.



Friday, July 22, 2011

అమ్మమ్మ కతలు: సరదాగా సినిమాకి

అసలే ఎండాకాలం. ఒంటి పూట బళ్ళు. ఎంత త్వరగా స్కూల్ అయిపోతుందా. అమ్మమ్మ ఇంటికి వెళదామా అని ఎదురుచూస్తూ ఉండగానే అమ్మమ్మ గొడుగు వేస్కొని వచ్చేసింది నా కోసం. స్కూల్ నుండి తీసుకు వచ్చి అన్నం తినిపించాగానే బాగా అలిసిపోయి నిద్ర ముంచుకు వచ్చేసింది నాకు. అమ్మమ్మ నా తల నిమురుతూ వుంటే ఎప్పుడు నిద్రలో జారుకున్ననో తెలియదు. నన్ను జాగ్రత్తగా  పడుక్కోబెట్టింది.

ఉదయం పదవ్వగానే ఆవిడ భోజనం అయిపోయేది. కిళ్ళీ  వేసుకొని పడుక్కునేది కాసేపు. అమ్మమ్మ ఏంటి? కిళ్ళీ  వేస్కోడం ఏంటి? అనుక్కునేరు. ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ వుంటుంది. అమ్మ తిడుతుందేమో అని భయం ఒక పక్క వున్నా మా అమ్మని ఇదే విషయం అడిగేసా ఒక రోజు. మా అమ్మమ్మకి పెళ్ళయ్యాక హఠాత్తుగా పంటినొప్పి రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో ఎవరో చెక్క నవలమని చెప్పిన సలహా విని మా తాతగారు చెక్క తెప్పించి ఇచ్చేవారు. పంటినొప్పి తగ్గినా చెక్క అలవాటు అలాగే ఉండిపోయింది. తరవాత కిళ్ళీవేసుకోడం అలవాటయ్యింది అని అమ్మ చెప్పింది.

నేను నిద్రపోయానని అలా పక్కింటి మామ్మగారి ఇంటికి వెళ్లి లోకాభిరామాయణం మాట్లాడుతోంది అమ్మమ్మ.  "మన పక్క థియేటర్లో 'మల్లీశ్వరి' సినిమా ఆడుతోంది పిన్నిగారు. మధ్యాహ్నం వెళదామా?" అని మామ్మగారు మా అమ్మమ్మని   అడిగారు. ఆవిడ అడగడం ఇది మూడోసారి. నిజానికి ఆ సినిమా అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. అందులో "మనసున మల్లెల మాలలూగెను..." అనే పాటంటే ఇంకా ప్రాణం. కాని వేసవి ఎండలు కొంచం తగ్గాక వెళ్ళచ్చు అని వాయిదా వేస్తూ వచ్చారు కమలమ్మగారు. ఇంకా ఆలస్యం చేస్తే సినిమా వెళ్లిపోతుంది అని ఆవిడ అనడంతో మరునాడు వెళ్ళాలని ఇద్దరు అనుకున్నారు. 

ఈ లోపు నేను నిద్ర లేవడం, అమ్మమ్మ కనిపించక "అమ్మమ్మ !!అమ్మమ్మా!!" అంటూ ఏడుస్తూ తలుపు తెరవబోయాను. కాని అది రాలేదు. బహుశా అమ్మమ్మ బయటనుండి గడియపెట్టి వుంటుంది. దానితో మరింత ఏడుపు వచ్చింది. ఈ లోగా ఎవరో చూసి అమ్మమ్మకి చెప్పడంతో పరుగెత్తి వచ్చి తలుపు తెరిచి నన్ను ఎత్తుకుంది. "పండు, నిద్ర లేచావా. నువ్వు పడుకున్నావు కదా అని పక్కింటి బామ్మగారితో మాట్లాడుతున్న కన్నా" అని ఊరుకో బెట్టింది. ఏడుపు ఆపక పోవడంతో "ఏడవకు రా కన్నా. రేపు మనం సరదాగా సినిమాకి వెళదాం. సరేనా" అని అనడంతో నేను చాలా సంతోషించా. 

మరునాడు రానే వచ్చింది. స్కూల్ నుండి రాగానే అన్నం తిని మాట్నీకి బయలుదేరాం ముగ్గురం. మాములుగా అయితే నడిచిపోయే దూరమేగాని మండుటెండ పైగా చిన్నపిల్లని నేనున్నాను అని  రిక్షా బేరమాడుకుని వెళ్లాం. తీరా చుస్తే థియేటర్లో 'వందేమాతరం' అనే కొత్త సినిమా ఆడుతోంది.  'మల్లీశ్వరి' సినిమా ముందురోజు వెళ్లిపోయిందిట.   ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళు అనుకునేంతలో నేను ఆరున్నొక్క రాగం పెట్టడంతో ఇక తప్పక ఆ సినిమా టికెట్స్ తీసుకున్నారు. ధియేటర్లో జనం పల్చగావున్నారు. సినిమా మొదలవ్వడంతో అంతా కూర్చున్నారు. మా ముందువరుసలో ఓ తల్లితండ్రి పిల్లజెల్ల కుర్చుని వున్నారు. వారి ముందు సీట్లు అన్ని ఖాళీ. సినిమా మొదలైన పావుగంట తరవాత "అమ్మమ్మా నేను ఆ ఖాళీ సీట్లలో కుర్చుంటా ప్లీజ్" అని అడిగా. సరే అంది అమ్మమ్మ. ఇంటర్వల్ రాగానే పెద్దగా ఓ ఆడ గొంతు, మా అమ్మమ్మ గొంతు పొట్టాడుకుంటూ వినిపించాయి. "ఎహ్ హమారీ బచ్చి హై" అంటే "కాదు ఇది నా పిల్ల" అని పెద్ద గొడవ. అక్కడ ఓ మినీ యుద్ధవాతావరణం నెలకొంది.  నేను ఓ ఐదునిమిషాల తరవాత మెల్లగా గొంతుపెగుల్చుకుని "అమ్మమ్మ నేను ఇక్కడే వున్నా" అని అనడంతో మా అమ్మమ్మ వాళ్ళతో సిగ్గుపడి "క్షమించండి అచ్చు మా మనవరాలి లాగ కనపడితేను..." అని మాత్రం అనగలిగింది. "ఇంటికి వెళ్ళాక నీ పని అయిపోయింది" అంది నా మనసు . అమ్మమ్మ మాత్రం "నువ్వు ఎప్పుడు అక్కడ కుర్చున్నావో మర్చిపోయానే" అని నవ్వేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.

Wednesday, July 20, 2011

అమ్మమ్మ కతలు: స్కూలు గోల

"ప్రొద్దుననగా వెళ్ళింది స్కూలుకి. ఏం చదువులో ఏంటో ఈ కాలం పిల్లలకి" అని తిట్టుకున్నారు కమలమ్మ గారు ఎల్.కె.జి చదువుతున్న నన్నుతల్చుకుంటు. అలా అని ఆవిడకి చదువంటే ఇష్టం లేదని అనుకునేరు. చదువంటే ఆవిడకి ప్రాణం. చిన్నవయస్సులో భర్త పొతే బండెడు సంసారన్ని ఒంటరిగా ఎలా ఈదుకొచ్చిందో ఆవిడకే తెలుసు. అందుకే చదువు ఆడపిల్లలకి ఎంతో ముఖ్యం అని ఆవిడ తన కూతుర్లు అందరిని కొడుకులతో సమానంగా చదివించింది. నా మీద ప్రేమతో అలా అనిపించింది ఆమెకి. అంతే!!

నాన్న ఉద్యోగరీత్యా మేము ఆ ఊర్లోనే వుండేవాళ్ళం.అమ్మమ్మ ఇంటికి దగ్గర వున్న స్కూల్లో చదివేదాన్ని.  తన ఇంటికి  స్కూల్ దగ్గరే కావడంతో మధ్యాహ్నం లంచ్ అవర్లో నన్ను తీసుకొచ్చి అన్నం తినిపించి మరల స్కూలుకి దిగబెట్టేవారు కమలమ్మగారు. ఎప్పుడైనా ఒంటిపూట బళ్ళు ఐతే, అమ్మ సాయంకాలం వచ్చి తీసుకువెళ్ళే వరకు తన దగ్గర అట్టే పెట్టుకుని వీధిలో బంధువులు, స్నేహితుల ఇళ్ళకి 'మా మనుమరాలు ' అని మురిపెంగా తీసుకువెళ్ళేవారు ఆవిడ.

"అమ్మమ్మా అమ్మమ్మా!" అంటూ అల్లుకుపొయేదాన్ని.అందుకే ఆవిడకు నేనంటే వల్లమాలిన ప్రేమ.స్కూల్లో రోజు పన్నెండు గంటలకి లంచ్ బెల్ కొట్టినా, అమ్మమ్మ మాత్రం "పిల్ల ఎండ పడిపోతుంది" అని ఓ గొడుగు పుచ్చుకుని అరగంట ముందే చేరుకుని "మీ చదువులు మీరు, మీ మొహాలు మండా. చంటి వెధవలకి ఇంతింతసేపు చదువులు ఏవిటి?" అని అక్కడ అటెండర్ ని తెగ కంగారు పెట్టేసేవారు. అటెండర్ అప్పారావు కి ఇది మాములే. "బామ్మగారు, ప్లీజ్!! నా వుద్యోగం వూడి పోతుందండీ . అలా మీ మనుమరాలు ఒక్కర్తి కోసం బెల్లు కొట్టకూడదండి" అనేవాడు.

ఎప్పుడైనా భోజనం తరువాత "అమ్మమ్మా! ఇవాళ స్కూల్ కి వెళ్ళను" అని గోల పెడితే క్లాస్స్ రూం లోపలవరకు తీసుకువెళ్లి దిగబెట్టి కాసేపు కూర్చుని వచ్చేది ఆవిడ. పెద్దయ్యాక ఒక్కోసారి కాలేజ్, లేదా ఆఫీసు కి వెళ్ళాలని అని అనిపించక పోతే, అదే గుర్తుకు వచ్చేది నాకు. ఇంకా మారం చేస్తే 'తాయిలం' ఇస్తానని ఆశ పెట్టి స్కూల్ కి పంపేది.

ఇలా రోజులు గడిచిపోతుండగా, ఒక రోజు కూడా ప్రతిరోజులాగానే ఆవిడ గొడుగుతో బయలుదేరారు. కాకపొతే ఆవేళ కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఆయాసపడుతూ రొప్పుతూ కమలమ్మగారు వెళ్ళేసరికి అటెండర్ అప్పారావు అక్కడ స్టూల్ మీద కనపడలేదు. "వీడు రోజు ఇక్కడే వుంటాడు. అలాంటిది ఇవాళ కనపడట్లేదేవిటో" అని కంగారుపడుతూ ఆఫీస్ రూం వైపు దారితీసారు కమలమ్మగారు. "ఏమ్మా లంచ్ బెల్ కొట్టేసారా?" అని అక్కడ కనిపించిన ఆయాని అడిగారావిడ."కొట్టేసారండి" అని చెప్పేసరికి "ఎల్.కె.జి క్లాస్ రూం ఎక్కడుంది. నా మనుమరాలు నాకోసం చూస్తూవుంటుంది. కొంచెం పిల్చుకురామ్మ" అని అర్ధింపుగా అడిగారావిడ. "ఎవరూ లేనట్లున్నారమ్మా. ఐనా ఓ మారు సూసొత్తాను వుండండి" అని ఆయా క్లాస్ రూం వైపు వెళ్ళింది. "ఈ ఆయా పొరపడివుంటుంది. తను వచ్చేదాకా బుద్ధిగా కూర్చుంటుందిలే. ఎక్కడికి కదలదు" అని ధీమాగా ఎదురుచూడసాగారు ఆవిడ.దూరం నుండి ఆయా ఒక్కర్తే రావడం చూసి కమలమ్మగారి ఆదుర్దా ఎక్కువవ్వసాగింది. "ఎవలూ లేరమ్మా. కలాసురూం ఖాలీ" అని ఆయా చెప్పడంతో ఆవిడకి ముచ్చెమటలు పోసాయి. "సరిగ్గా చూసావా. ఇంకెక్కడైన వుందేమో" అని టెన్షన్ పడసాగారు. ఇంతలో అప్పారావు వచ్చి "పిల్లలంతా ఎల్లిపోనారు బామ్మగారు" అని చెప్పడంతో ఆవిడకి ఒక్కసారి గుండె గుభేలుమంది. "అయ్యొ పిల్ల ఎమైందో. ఎవరైన ఎత్తుకుపొయారేమో. అసలే రొజులు బాగాలేవు. ఇప్పుడు కూతురికి అల్లుడుకి ఎలా మొహం చూపించాలి" అని తల్చుకుంటే ఏడుపు వచ్చింది ఆవిడకి.

కమలమ్మగారికి ఏమిచెయ్యలో పాలుపోవడం లేదు. "కూతురికి చెప్తే? అమ్మో!! ఇది విని తట్టుకోగలదా. పోనీ అల్లుడికి చెప్తే? ఆయన అసలు తట్టుకొలేడు. ఇప్పుడు ఏమి చెయ్యడం?" అని అలోచించసాగారు. చివరికి తన వీధిలోనె అద్దెకి వుండె మనుమరాలి వాళ్ళ క్లాస్ మేట్ జ్యోతి గుర్తుకి వచ్చింది కమలమ్మగారికి. పరుగు పరుగున వాళ్ళ ఇంటి తలుపు తట్టారు. "ఏమ్మా మా మనుమరాలు మీ ఇంటికి ఏమైన వచ్చిందా?" అని అడిగారావిడ."లేదు అమ్మమ్మగారు రాలేదు. స్కూల్ అయ్యాక నేను ఒక్కదాన్నే మా ఇంటికి వచ్చేసా" అని చెప్పింది జ్యొతి.అది విని ఆవిడ ఆందోళన ఇంకా అధికమైంది. ఇంక లాభం లేదని కూతురి ఆఫీసుకి రిక్షా చేయించుకుని వెళ్ళారు.  "అమ్మా ఈ టైములో ఇలా వచ్చావేమిటి? ఒక్కర్తివీ వచ్చావేంటి? పండు ఏది?" అని ప్రశ్నించే సరికి ఆవిడకి దుఖం ఆగలేదు. "పండు కనిపించటం లెదు" అని బావురుమన్నారు. "అమ్మా, ఏమిటి నువ్వు చెప్పేది. ఎక్కడకి వెళ్ళి వుంటుంది. స్కూల్లో సరిగ్గా వెతికావా?" అని పూడుకుపోయిన గొంతుకతో వస్తున్న ఏడుపు ఆపుకుంటూ అడిగింది అమ్మ. "అంతా వెతికే వస్తున్నానమ్మా. ఎక్కడాలేదు" అని బదులిచ్చారు ఆవిడ తన ఏడుపు దిగమింగి. "మళ్ళీ ఇంకోసారి చూసి వద్దాం పదమ్మా" అని రిక్షాలో స్కూల్ కి బయలుదేరారు ఇద్దరూ.

అక్కడ అటెండరు అప్పారావు కనపడ్డాడు మళ్ళీ. "బామ్మగారు ఇలగ వొచ్చారేటండి మళ్ళీ? మీ మనవరాలు కనపడనేదా?" అని అడిగాడు. వెంటనే అమ్మ "లేదయ్యా. ఎల్.కె.జి క్లాస్ టీచర్ వున్నారా? వెళ్ళిపొయారా?" అని అడిగారు. "స్టాఫ్ మీటింగ్ వుందని ఇయ్యాల ఇక్కడె వున్నారమ్మ అందరూ. మీటింగ్ గంట క్రితమే ఐపోనాదమ్మ. కొందరు టీచర్లు ఇంకా పని వుండి స్కూల్ లోనే వున్నారు. ఇక్కడే కూకోండి. పిల్సుకు వొత్తాను." అని లోపలికి వెళ్ళాడు. ఇద్దరికీ కూర్చో బుద్ధి కాలేదు. "ఒకవేళ టీచర్ కి తెలియదంటే ఏమిచెయ్యడం? ఈయనకి చెప్పి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడమే. ఎక్కడికి వెళ్ళుంటుంది నా చిట్టితల్లి?" అని అలోచనలో పడింది అమ్మ.  ఒకపక్క కమలమ్మగారు తనకి తెలిసిన దేవుళ్ళందరికి మొక్కెస్తున్నారు.  ఇంతలో ఎల్.కె.జి క్లాస్ టీచర్ లక్ష్మి వచ్చారు అక్కడికి. "పిల్లలందరు క్లాస్ వదలగానే వెళ్ళి పోయారు మేడం" అన్న ఆవిడ మాటవిని కుప్పకూలిపొయారు ఆవిడ.

"భగవంతుడా!! అనుక్కున్నంతా అయ్యింది. ఇప్పుడు ఏది దారి?" అని స్కూల్ ఆవరణ దాటి రిక్షా లో కుర్చోబొయేంతలో "మేడం. ఒక్క నిమిషం!!" అనే పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చుసే సరికి లెక్కల టీచర్ నీరజ కనిపించారు. "స్కూల్ లో కొత్తగా జాయినైన దీప్తి టీచర్ ఇందాకల పిల్లలు కొందరిని రిక్షాలో ఎక్కించుకుని ఎటో వెళ్ళడం చూసాను" అని చెప్పడంతో ఒక్కసారిగా టెన్షన్ తగ్గి దాని స్థానంలో కోపం చోటుచేసుకుంది అమ్మలో.

దీప్తి టీచర్ ఇల్లు ఎక్కడో కనుక్కుని అమ్మ, అమ్మమ్మ బయలుదేరబోతుండగ ఎదురుగ మిగతా పిల్లలతో గెంతుకుంటూ ఆడుకుంటూ రిక్షాలో  వస్తున్న నన్ను చూడగానే వాళ్ళిద్దరికి ప్రాణం లేచివచ్చింది. ఏడుస్తున్న అమ్మని అమ్మమ్మని చుస్తూనే నేను ఒక్క వుదుటన "అమ్మా! అమ్మమ్మా!!" అని అల్లుకుపోడం, ఇక ఆతరవాత దీప్తి టీచర్ కి అందరూ క్లాస్ తీసుకోడం, ఆవిడ "సారీ అండీ,  మా ఇల్లు స్కూల్ దగ్గరలోనే కదా. పిల్లల్ని సరదాగ ఇంటికి తీసుకు వెళ్ళి కొంచెం స్నాక్స్ పెట్టి ఆడించి తీసుకు వద్దామని అనుకున్నాగాని, మీరంతా ఇలా కంగారు పడతారని అనుకొలేదు" అని సంజాయిషీ ఇవ్వడం జరిగిపొయాయి."పండు... మా బంగారం!!! ఎంత హడలుకొట్టేసావే మా అందరిని??!!!" అని అమ్మమ్మ నన్ను హత్తుకుంది.